గోధుమపిండిలో ఉప్పు వేసి, నీటితో చపాతీ పిండిలా కలుపుకోవాలి. ప్యాన్లో నూనె వేడిచేసి ఉల్లితరుగు, ఉల్లిపరక, పచ్చిమిర్చి వేసి మెత్తబడేవరకు వేయించాలి. తరవాత తరిగిన క్యాబేజీ, క్యారట్, తగినంత ఉప్పు, పసుపు వేసి బాగా కలియబెట్టి మూతపెట్టాలి. ఐదు నిమిషాల తరవాత తడి పోయాక కొత్తిమీర వేసి దింపేయాలి. పిండి బాగా మెత్తగా అయ్యాక చిన్న ఉండలుగా చేసుకుని పలుచగా చపాతీ సైజులో ఒత్తుకోవాలి. పెనం వేడి చేసి ఈ చపాతీని రెండువైపులా కొద్దిగా వెచ్చబెట్టి తీసి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తరవాత చపాతీలను రెండు అంగుళాల వెడల్పులో నిలువుగా రిబ్బనులా కట్ చేసుకోవాలి. ఒక కొనవైపు కొద్దిగా ఉల్లిపాయ మిశ్రమాన్ని పెట్టి త్రికోణంలా మడుస్తూ పోవాలి. మొత్తం సమోసాని త్రికోణంలా మడిచాక అంచులు తడిచేసి విడిపోకుండా ఒత్తి మూసేయాలి. వేడినూనెలో వేసి కరకరలాడేలా వేయించాలి.