చింతపండును నానబెట్టి చిక్కగా పులుసు తీసి పక్కన ఉంచాలి. బాణలిలో నూనె వేసి ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను మెంతులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి పోపు పెట్టాలి. ఇవన్నీ వేగిన తర్వాత చింతపండు పులుసు పోసి ఉప్పు వేయాలి. పులుసు ఉడుకుతుండగా మరొక బాణలిలో నూనె వేయకుండా శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పులను వేయించాలి. ఈ పప్పులు చల్లారేలోపు అదే బాణలిలో మెంతులు, ఆవాలు, జీలకర్ర వేయించాలి. చల్లారిన తర్వాత పప్పులను, పోపు దినుసులను విడిగా పొడి చేసుకోవాలి. మరుగుతున్న పులుసులో బెల్లం వేసి, తర్వాత పోపు దినుసుల పొడి వేయాలి. ఆ తర్వాత పప్పుల పొడిని నీటిలో కలిపి (ఉండలు కట్టకుండా ఉండడానికి) పులుసులో పోసి ఐదు నిమిషాల సేపు ఉడికించి దించాలి.